శాంతిస్వరూప్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, నారా లోకేశ్

  • న్యూస్ రీడర్ గా శాంతిస్వరూప్ తనదైన ముద్ర వేసుకున్నారన్న రేవంత్ రెడ్డి
  • ఆయన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయమని వ్యాఖ్య
  • వార్తలు అంటే శాంతిస్వరూప్ అన్నంతగా ప్రజలకు దగ్గరయ్యారన్న లోకేశ్
తొలి తెలుగు న్యూస్ రీడర్ గా ఖ్యాతి గడించిన శాంతిస్వరూప్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తొలి తరం న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితులైన శాంతిస్వరూప్ గారి మరణం బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1983 నుంచి న్యూస్ రీడర్ గా శాంతిస్వరూప్ తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ ద్వారా ఆయన అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయం అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. శాంతిస్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

దూరదర్శన్ అంటే వార్తలు... వార్తలు అంటే శాంతిస్వరూప్ గారు అన్నంతగా తెలుగు వీక్షకులకు దగ్గరైన శాంతిస్వరూప్ గారి మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. శాంతిస్వరూప్ గారికి కన్నీటి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. 


Shanthi Swaroop
Revanth Reddy
Congress
Nara Lokesh
Telugudesam

More Telugu News